Tuesday, October 23, 2012

దేవీనవరాత్రుల విశిష్టత.............

                                                 

ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.

ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.

శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.

ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని  శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.

దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కుష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయనీ
7. కాళరాత్రి
8. మహాగౌరి
9. సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో

శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!

అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.

అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆదేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

No comments:

Post a Comment