Thursday, September 27, 2012

సాయితత్వం

                                      సాయితత్వం

                                     
 శిరిడీలో పాడుబడ్డ మసీదులో చాలా సంవత్సరాలు నివసించి పిచ్చి ఫకీరుగా కనిపించిన మహా యోగి, పరమాత్మ, సచ్చిదానంత స్వరూపుడు శ్రీసాయినాథుడు. సాయి ఫకీరేనా లేక నిజంగా పరమాత్మా అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అంతా మాయ.. సాయి లీలామృతం. దీన్నే శాంబరీ విద్య అంటారు. విష్ణుసూక్తంలోని 5వ శ్లోకంలో ఈ శాంబరీ విద్యగురించి విశదంగా వివరణ ఉంది. "ఇంద్రా విష్ణూ దృంహితాః శంబరస్య..."అంటూ ఇచ్చిన వివరణను అవగతం చేసుకోగలిగితే అతరార్ధం బోధపడుతుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనిపించడమే మాయ. ఆ మాయనుంచి తప్పించుకోవడం బ్రహ్మాదులకుకూడా సాధ్యం కానిపని. కానీ.. అతి శునిశితంగా గమనించగలిగే మాత్రం సాధువులను గుర్తుపట్టడం సాధ్యమే.. దానికి తపోనిష్ట, సంకల్పబలంకూడా కావాలి.

భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో "దైవీ హ్యేషాగుణమయీ మమ మాయా దురత్వయాం.." అంటూ భగవానుడు తన మాయ త్రిగుణాత్మకమైనదని చెప్పుకొచ్చాడు. అలౌకికమైన ఆ మాయను అధిగమించడం ఆయా అవతారాల్లో స్వయంగా ఆయనకికూడా సాధ్యం కాలేదుమరి. అందువల్లే చాలామంది శిరిడీ సాయినాధుడికి చాలా దగ్గరగా ఉండికూడా ఆయనను గుర్తించలేకపోయారు. మాయామోహాన్ని జయించి సర్వం పరమాత్మ తత్వమే అని గుర్తెరిగినవాళ్లు మాత్రం సాయి లీలల్ని ఆస్వాదించగలిగారు.

గుర్తించలేనివారికి సాయి ఓ ఫకీరు. పిచ్చివాడు. అగ్గిపుల్లలు, నాణేలతో ఆడుకుంటూ, మాసిన బట్టలతో తిరుగుతూ, పాడుబడ్డ మసీదులో ఉంటూ, ఊదీ పాటను పాడుకుంటూ సాయి చేసిన విచిత్రమైన లీలలు.. గుర్తించగలిగినవాళ్లకి మాత్రం ఎన్నో అంతరార్ధాల్ని విడమరిచి చెప్పాయి. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ, గాల్లో చేతులు ఆడిస్తూ తెలియనిలోకాలవైపుచూస్తూ సాయి చేసే విచిత్రమైన చేష్టల వెనక ఎన్నో లీలలు ఉండేవి.

తనను చూసేందుకు వచ్చిన వాళ్లదగ్గర దక్షిణ అడిగిమరీ పుచ్చుకుని సాయి వాళ్లను పునీతుల్ని చేసేవాడు. రోజూ శిరిడీ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ తనకు భిక్షవేసినవాళ్ల పాపాల్ని కడిగేసేవాడు. ఓ వ్యక్తి.. సాయీ నిన్ను అందరూ పిచ్చివాడంటున్నారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని నేరుగా అడిగాడు.. అప్పుడు సాయి నాథుడు.. అలా అనుకునే వాళ్లే పిచ్చివాళ్లంటూ ఆయనకు సమాధానం చెప్పాడు.

నిజానికి సాయి దేవుడే అయితే మరి ఎప్పుడూ అల్లా అచ్ఛాకరేగా అనడం ఎందుకు? అన్న సందేహం కూడా చాలా మందికి కలిగింది. అలాంటి సందేహాలు ఎన్నింటికో సాయి ప్రత్యక్షంగా లీలల్ని చూపి సరైన సమాధానం చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ నమ్మిన భక్తులకు నాయకుడై కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటున్నాడు.

No comments:

Post a Comment